3 నిమిషాలు చదవండి
దేవుడు ఇప్పుడు మన నుండి ఏమి కోరుకుంటున్నారో ఎవరైనా నేరుగా చెబితే బాగున్ను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
మనం పరిశుద్ధ గ్రంథాలను తెరిచినప్పుడు అద్భుతమైన సత్యాలను కనుగొంటాము. ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు శాంతిని అనుభవిస్తాము. అయినప్పటికీ జీవితం కొత్తగా, సంక్లిష్టంగా అనిపించే ప్రశ్నలను తీసుకువస్తుంది—కుటుంబం, ఉద్యోగం, విశ్వాసం, భయం మరియు భవిష్యత్తు గురించిన ప్రశ్నలు. అటువంటి క్షణాల్లో, చాలామంది ఇలా ఆలోచిస్తుంటారు:
నా వద్ద పరిశుద్ధ గ్రంథాలు ఉండి, నేను స్వయంగా ప్రార్థించగలిగినప్పుడు, నాకు ఇంకా జీవించియున్న ప్రవక్త ఎందుకు అవసరం?
అది ఒక సరైన ప్రశ్న. దానికి లభించే సమాధానం నిజమైన ఓదార్పును ఇస్తుంది.
దేవుడు ఎల్లప్పుడూ ప్రవక్తల ద్వారానే మాట్లాడారు
ఆరంభం నుండి, దేవుడు తాను ఎన్నుకున్న సేవకుల ద్వారా తన పిల్లలను నడిపించారు. ఆయన పిలిచారు:

- జలప్రళయానికి ముందు లోకమును హెచ్చరించడానికి నోవహును
- ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషేను
- రాబోయే రక్షకునితో సాక్ష్యమివ్వడానికి యెషయాను
- యేసుక్రీస్తు కొరకు మార్గాన్ని సిద్ధపరచడానికి బాప్తిస్మమిచ్చు యోహానును
ఈ క్రమం ఎన్నడూ మారలేదు.
ప్రభువు ఇలా ప్రకటించారు:
“తన సేవకులైన ప్రవక్తలకు తన మర్మమును బయలుపరచకుండా ప్రభువైన దేవుడు ఏ పనియు చేయడు.” — ఆమోసు 3:7
దేవుడు తన పిల్లలను జీవిత సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోవడానికి వదిలేయరు. ఆయన జీవించియున్న ప్రవక్తల ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత ప్రకటన మరియు ప్రవక్త పొందే ప్రకటన
ఈ రెండింటి మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది.
పరిశుద్ధాత్మ ద్వారా, ప్రతి వ్యక్తి తమ స్వంత జీవితం కొరకు మరియు తమ కుటుంబం కొరకు వ్యక్తిగత ప్రకటనను పొందవచ్చు. ఇది ఒక పవిత్రమైన మరియు అందమైన కానుక.
అయితే, తన సంఘం ఎలా నడిపించబడాలి అనే దాని గురించి ప్రభువు ఎవరికి పడితే వారికి ప్రకటన ఇవ్వరు. ఆయన తన ప్రవక్తల ద్వారా తన సంఘాన్ని నడిపిస్తారు మరియు నిర్దేశిస్తారు. వ్యక్తులుగా, మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రకటన పొందుతాము. ప్రవక్త సమస్త సంఘం కోసం ప్రకటన పొందుతారు.
క్రీస్తు అపొస్తలులను మరియు ప్రవక్తలను ఇచ్చినట్లు పౌలు బోధించారు:
“పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిచర్య ముగియునట్లు, క్రీస్తు శరీరము పెంపొందునట్లు.”-ఎఫెసీయులకు 4:11–13
క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు యొక్క సంఘానికి ప్రవక్తలు అత్యంత అవసరమైతే, వారి పాత్ర నేడు కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది.
ఆధునిక కాలపు ప్రవక్త ఏమి చేస్తారు?
ఆధునిక కాలపు ప్రవక్త యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేక సాక్షి. సత్యాన్ని బోధించడానికి, సంఘం కొరకు ప్రకటన పొందడానికి మరియు రక్షకుని రెండవ పునరాగమనం కొరకు లోకాన్ని సిద్ధపరచడానికి ఆయన దేవునిచే పిలవబడతారు.
ఆధునిక ప్రవక్తలు యేసుక్రీస్తు నందు మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, దేవుని ఆజ్ఞలనుగైకొనడానికి, పవిత్రమైన నిబంధనలు చేసుకుని వాటిని నిలబెట్టుకోవడానికి మరియు పునరుద్ధరించబడిన సువార్త ద్వారా శాంతిని కనుగొనడానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు.
వారి ఉపదేశం ఎల్లప్పుడూ మనల్ని రక్షకుని వైపు నడిపిస్తునే, మన కాలపు సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది.

ప్రవక్తలు ప్రభువు స్వరమును వినడానికి మనకు సహాయపడతారు
సత్యం, ఆనందం మరియు జీవిత ఉద్దేశం గురించి ప్రపంచం అనేక రకాల అభిప్రాయాలతో నిండి ఉంది.
ఆ గందరగోళం మధ్య ప్రభువు స్వరమును గుర్తించడానికి జీవించియున్న ప్రవక్త మనకు సహాయపడతారు.
మనం పరిశుద్ధ గ్రంథాలతో పాటు ఆయన బోధలను అధ్యయనం చేస్తున్నప్పుడు, పూర్వ తరాలు ఎన్నడూ ఎదుర్కోని ప్రశ్నలు మరియు సవాళ్లకు మార్గదర్శకత్వాన్ని పొందుతాము. ఆయన ఇచ్చే ఉపదేశం దేవుని నుండి వచ్చే ప్రకటన ద్వారా వస్తుంది కాబట్టి, మారుతున్న ఈ లోకంలో ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండటానికి మనకు సహాయపడుతుంది.
ఒక ప్రవక్తను అనుసరించడం అనేది చివరగా, తన సేవకులను పిలిచి నిర్దేశించే యేసుక్రీస్తు నందు విశ్వాసాన్ని వ్యక్తపరచడమే.
దేవుని మార్గదర్శకత్వం నేడు కూడా కొనసాగుతోంది
పునరుద్ధరించబడిన సువార్త యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి ఏమిటంటే, పరలోకం మౌనంగా లేదని తెలుసుకోవడం.
దేవుడు ఇప్పటికీ తన పిల్లలను ప్రేమిస్తున్నారు.
ఆయన ఇప్పటికీ ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు.
ఆయన ఇప్పటికీ తన చిత్తాన్ని బయలుపరుస్తున్నారు.
మరియు ఆయన తన సంఘాన్ని నడిపించడానికి ఇప్పటికీ ప్రవక్తలను పిలుస్తున్నారు.
నేడు, 2026లో, ప్రభువు అధ్యక్షులైన డాలిన్ హెచ్. ఓక్స్ గారిని జీవించియున్న ప్రవక్తగా మరియు యేసుక్రీస్తు యొక్క చివరి రోజుల పరిశుద్ధుల సంఘం అధ్యక్షునిగా పిలిచారు. నోవహు, మోషే, యెషయా, పేతురు మరియు పూర్వపు ఇతర ప్రవక్తల ద్వారా ఆయన తన ప్రజలను ఎలా నడిపించారో, అలాగే నేడు కూడా జీవించియున్న ప్రవక్తల ద్వారా తన పిల్లలను నడిపిస్తూనే ఉన్నారు.

జీవించియున్న ప్రవక్త దేవుని ప్రేమకు ఆధారం
ప్రభువు తన పిల్లలను ఎన్నటికీ మార్గదర్శకత్వం లేకుండా వదిలేయలేదు.
ప్రవక్తలు యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తారు, ఆయన సువార్తను బోధిస్తారు మరియు పరలోక తండ్రి వద్దకు తిరిగి తీసుకెళ్లే నిబంధన మార్గంలో మనం నిలిచి ఉండటానికి సహాయపడతారు.
మనం వారి ఉపదేశాన్ని అధ్యయనం చేస్తూ, వారి బోధల గురించి ప్రార్థిస్తూ, విశ్వాసంతో నడుచుకున్నప్పుడు, దేవుడు నేడు కూడా తాను ఎన్నుకున్న సేవకుల ద్వారా మాట్లాడుతున్నారనే స్వంత సాక్ష్యాన్ని మనం పొందవచ్చు.
పూర్వ కాలంలో ప్రవక్తలను పిలిచిన దేవుడే మన కాలంలో కూడా ప్రవక్తలను పిలుస్తున్నారు — ఎందుకంటే తన పిల్లలపై ఆయనకున్న ప్రేమ ఎన్నడూ మారలేదు.
మూలం: ప్రవక్తలు అంటే ఏమిటి?
మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:
- కుటుంబాలు దేవుని ప్రణాళికలో ఎందుకు కేంద్రబిందువుగా ఉన్నాయి?
- మీరు వ్యక్తిగత ధర్శనం ఎలా పొందవచ్చు?
- శ్రమల సమయంలో కూడా మనం సంతోషాన్ని ఎలా కనుగొనగలము?
సంబంధించిన వీడియో
